||సుందరకాండ ||

||యాభైరెండవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ద్విపంచాశస్సర్గః||

రావణుడు మహాత్ముడైన హనుమంతుని వచనములను విని క్రోధమూర్ఛితుడై హనుమంతుని వధించుటకు ఆజ్ఞాపించెను.

దురాత్ముడైన రావణునిచే హనుమంతుని వధించమని నివేదించబడిన ఆజ్ఞ విభీషణునికి దూతను చంపుట అధర్మము అని తోచెను. కార్యములను సరిగా చేయు విభీషణుడు కోపోద్రిక్తుడైన రాజు , వధించమని ఇచ్చిన ఆజ్ఞ తెలిసికొని ఏమి చేయవలెను అని ఆలోచించెను. అప్పుడు ఆలోచనలలో నిశ్చయమునకు వచ్చి శత్రువులను జయించు, వాక్య విశారదుడు తన అగ్రజుని ఎంతో హితమైన వచనము లతో ఇట్లు పలికెను.

' ఓ రాక్షసేంద్ర ! క్షమించుము. రోషమును విడువుము. ఈ నా వాక్యములను వినుము. రాజ్యములు ఏలువారు ఉచితానుచితములు ఎరిగినవారు, దూత వధ చేయరు. ఓ వీరుడా ! ఆ కపిని వధించుట రాజధర్మమునకు విరుద్ధము. అది లోకములో నిందించబడు కార్యము. అది నీకు తగని పని. నీవు ధర్మజ్ఞుడవు. కృతజ్ఞత గురించి తెలిసిన వాడవు. రాజధర్మములో విశారుదుడవు. ప్రాణులతో వ్యవహరించు విధానములు తెలిసినవాడవు. నీలాంటి విచక్షణ గలవారు కోపముతో ప్రవర్తిస్తే శాస్త్రజ్ఞానము సంపాదించుట కేవలము శ్రమయే అగును. ఓ రాక్షసేంద్రా ! శతృవులను వధించువాడా ! నిగ్రహించుము. యుక్తాయుక్తములను అలోచించి అప్పుడు దూతకు దండనము విధించవలెను'.

ఆరాక్షసేశ్వరుడు రావణుడు విభీషణుని వచనములను విని మహత్తరమైన రోషముతో ఈ విధముగా ఉత్తరమిచ్చెను. 'ఓ శత్రుసూదనా ! పాపులను వధించుట పాపము అనబడబోదు. ఈ పాపములు చేసిన వానరుని అందువలననే వధించవలెను '.

బుద్ధిమంతులలో వరిష్ఠుడైన విభీషణుడు బహు దోషములతో కూడినది, అధర్మమునకు మూలమైనది, ఆర్యులచేత ఆదరింపబడని ఆ వచనములను విని పరమార్థయుక్తమైన వచనములను పలికెను. ' ఓ రాక్షసేంద్రా లంకేశ్వర దయచేసి ప్రసన్నుడవు అగుము. ధర్మముతో కూడిన వచనములను వినుము. ఓ రాజన్ సంతులు సర్వత్ర ఈ విధముగా చెపుతారు. అన్ని సమయములలోనూ దూతలు వధింపతగని వారు. అశంసయముగా ఇతడు హద్దుమీరిన శత్రువు. ఇతనిచేత అసమానమైన అప్రియము చేయబడెను. అయినా సంతులు దూతను వధించమని చెప్పరు. దూతలకు విధింపతగు దండములు చాలా వున్నాయి. అంగవైరూప్యము , కొరడాతో కొట్టదము, ముండనము చేయడము, శరీరము మీద ముద్రలు వేయడము ఇవన్నీ దూతలకి ఇవ్వ తగిన దండములు అని సంతులు చెపుతారు. దూతల వధమాత్రము చెప్పబడలేదు.'

' ధర్మార్థములు ఎరిగినవారు యుక్తాయుక్తములను చూచి నిశ్చయమునకు వచ్చుదురు. నీలాంటి వారికి కోపము వస్తే ఎలాగ ? సత్త్వము గలవారు కోపమును అదుపులో ఉంచెదరు. ఓ వీర ధర్మవాదములోనూ, లోకజ్ఞానములోనూ, శాస్త్రములను అర్థము చేసుకొనుటలోనూ నీతో సమానులు లేరు. నీవు సురాసురులలో ఉత్తముడవు. ఓ నిశాచరేంద్రా నీవు సురులు అసురులకు కూడా దుర్జయుడవు. ప్రగల్భములు పలుకు సురదైత్య సంఘములు నరేంద్రుడూ యుద్ధములో అశక్యులై జయించబడినవారు. ఈ కపిని వధించుటలో ఒక మంఛి గుణము కనపడుట లేదు. ఈ కపిని ఇక్కడికి పంపించిన వారు దండనీయులు'.

' ఇతడు సాధువా కాడా అన్నది చర్చనీయము కాదు. ఇతరులచేత చెప్పుటకు పంపబడిన దూత వధింప తగడు. ఓ రాజన్ ! ఇతనిని చంపినచో ఈ మహాసాగరము దాటి ఇక్కడికి రాగలవాడు ఇంకొకడు నాకు కనపడుటలేదు. ఓ పరపుంజయ ! అందువలను ఇతనిని వధించు ప్రయత్నము చేయరాదు. నీవి ఇంద్రునితో సహా దేవతలతో యుద్ధము చేయుటకు తగినవాడివి.'
' ఓ యుద్ధప్రియుడా ! ఇతనిని వధించినచో దుర్వినీతులు సుదూరములో ఉన్న ఆ రాజపుత్రులనిద్దరినీ యుద్ధమునకు ఉద్యమించగల ఇతర దూతలు నాకు కనపడుటలేదు. రాక్షసుల మనస్సు రంజింపచేయువాడా సురాసురులని జయింపగల నీవు యుద్ధమునకు అవకాశమును నాశనము చేయుట యుక్తము కాదు. హితులు శూరులు మహాగుణములు కల కులములలో పుట్టినవారు , శస్త్రధారులలో శ్రేష్ఠులు యోధులూ కోట్లకొలది ఉన్నరు. వారు నీ అదేశముతో ఒక బలగము తీసుకుపోయి ఆ మూఢులైన రాజపుత్రులను జయించి నీ ప్రభావము చూపించుటకు వేచియున్నారు".

నిశాచరులలో సురలోకమునకు శత్రువు మహాబలుడు రాక్షసరాజులలో ముఖ్యుడు అగు రావణుడు తన తమ్ముడగు విభీషణుని ఉత్తమమైన విని ఆ వచనములను పాటించవలెనని తలచెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో యాభైరెండవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

 

 

 

 

 

 



||ఓమ్ తత్ సత్||